మహమద్ కులీకుతుబ్ షా - విశ్వ నగరంగా భాగ్యనగరం



మహమద్ కులీకుతుబ్ షా




  • క్రీ.శ 1580 లో గోల్కోండ సింహాసనాన్ని మహమద్ కులీకుతుబ్ షా అధిష్టించాడు.
  • క్రీ.శ 1591 లో హైదరాబాద్ నగరం ( భాగ్యనగరం ) నిర్మించాడు.
  • హైదరాబాద్ నగరవాస్తుశిల్పి- మీర్ మెమిన్ అస్త్రాబాది.
  • మహమద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి హైదర్ మహల్ అనే బిరుదును ప్రధానం చేసాడు.
  • మహమద్ కులీకుతుబ్ షా గోప్ప విద్వాంసుడు, కవి, ఇతను కలం పేరు- మానీలు.
  • మహమద్ కులీకుతుబ్ షా కాలాన్ని గోల్కోండ చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు.
  • గోల్కోండ కోటకు మగ్మద్ నగరు అని పేరు పేట్టాడు
  • మహమద్ కులీకుతుబ్ షా నిర్మించిన కట్టడాలు: చార్మినార్, మూసీనదికి ఆనకట్ట, చార్ కమాన్, దారుల్ షిఫా, దాదుమహల్, జామా మసీదు
  • 1593-94 హైదరాబాద్ ప్లేగు వ్యాధిని నిర్మూలించిన సందర్భంగా చార్మినార్ ను నిర్మించాడు
తెలంగణ రాజధాని నగరం హైదరాబాద్. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్ షా దీనిని నిర్మించాడు. కుతుబ్ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది.
   

చర్వితచరణమైనా చరిత్ర అది ఎప్పటికీ శ్రవణానందకరమే. వేల గొంతులతో వీనులవిందుచేసిన రాగాల దర్బారు కూడా ఒకనాటికి వానకారు కోయిలలా మూగబోవచ్చు. కాని బూజుపట్టిన మూగ దర్బారులోనే రాలి పడిన మువ్వ ఒకటి నాటి ఘనమైన జ్ఞాపకాలను ఏర్చికూర్చి పాటలా వినిపిస్తుంటుంది. ఆ పాట వేల రాగాలకు స్వాగతగీతం పాడుతుంది. నేటి తరాన్ని వెన్నంటి ప్రొత్సహిస్తుంది. ఇలాంటి ఘనచరిత గురుతులున్న భాగ్యనగరం నేడు సైబర్ సొబగులతో, డిజిటల్ మోతలతో ఆధునికతతో అలరారుతున్నంత మాత్రాన 'గతం గతః' అనుకుంటే పొరపాటే. మధురస్మృతులు ఒడిన దాచుకుని వడివడిగా పరుగెత్తిన మూసీ నేడు మురికినీటితో మూగబోయింది. అయినా మనసుండాలేకాని ఆ తీరంలో సాగిన నాగరికత జాడలు... ఎందరో నవాబుల, షరాబుల ప్రణయగాధలు... ఇంకెందరో గరీబుల గాయాల గుండెచప్పుళ్లు... మనకిప్పటికీ వినిపిస్తునే ఉంటాయి. 'కారే రాజులు రాజ్యముల్ గల్గవే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే...' అంటారు పోతనామాత్యులు. అలా రాజ్యాలు, రాజులు పోయినా ఈ సుందరనగరపు సుమధుర కథనాలు మాత్రం మనను విడిచిపోలేదు. మతంకన్నా మమతలు మిన్నని మనసుపడి ఓ నేలమగువలను మనువాడిన నవాబులు ఆనాడే అందరూ ఒక్కటేనని నిరూపించారు. ఆ ప్రేమకథలకు గురుతుగా ఈ భాగ్యనగరాన్ని బహుమతిగా మిగిల్చారు. నగరానికే ఓ అందమైన నగగా చార్‌మినార్‌ను నిలబెట్టారు. ముంగిళ్లలో ముత్యాలు రాశులుగా పోసి అమ్మిన ఈ నగరంలో నేడు 'మంచినీరు' కూడా వెలకట్టే విలువైన వస్తువుగా పరిణమించింది. అణువణువు 'ప్రియం'గా మురుతున్నా, ఎందరికో ప్రియమైన ప్రదేశంగానే మారుతోంది. ఎందరో చరిత్రపురుషులు అడుగుజాడల్లో ఈ నగరం తరించిపోయింది. ఈ మట్టివాసనలో ఆనాటి చరిత్ర జ్ఞాపకాలెన్నో పరిమళిస్తాయి. ప్రపంచాన్నే అబ్బురపరిచే విభిన్న సంస్కృతుల సమ్మిశ్రమమం ఒకవైపు, పడుగుపేకల్లా అల్లుకుపోయిన భిన్న సంస్కృతులు మరోవైపు ఈ భాగ్యనగరపు ఉనికికి నిరంతరం నీరాజనాలై వెలుగుతున్నాయి.
కుతుబ్‌షాహీల చరిత్ర
బహమనీ సుల్తానులలో రెండోవాడైన మహమ్మద్ షా (1358-75) గోల్కొండ దుర్గాన్ని ఆక్రమించగలిగాడు. క్రమ క్రమంగా బహమనీ సామ్రాజ్యం తెలంగాణా ప్రాంతాలకేకాక, కోస్తాఆంధ్ర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఆ సామ్రాజ్యాన్ని 1482 నుంచి 1518 వరకు పరిపాలించిన మహమూద్ షా బహమనీ 1496లో ''కులీకుతుబ్-ఉల్-ముల్క్'' అనే అనుచరుని తెలంగాణా ప్రాంతానికి గవర్నర్‌గా నియమించాడు. కులీకుతుబ్ గోల్కొండను కేంద్రంగా చేసుకొని తన ఆదీనంలో ఉన్న ప్రాంతాలను పరిపాలించాడు. మహమూద్ షా బహమనీ మరణానంతరం బహమనీ సామ్రాజ్యం బలహీనపడి నామమాత్రమైంది. ఇదే అదనుగా తీసుకొని అహమ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజపూర్ రాష్ట్రాల పాలకులు స్వతంత్రులయ్యారు. ఈ తరుణంలోనే కులీకుతుబ్ 1518లో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించి గోల్కొండ సామ్రాజ్యానికి మూలపురుషుడయ్యాడు.
హుస్సేన్‌సాగర్ నిర్మించిన ఇబ్రహీం
ఇబ్రహీం గొప్ప నిర్మాత. ఆయన హుస్సేన్ సాగర్‌ను నిర్మింపజేసి ఆ ప్రాంత ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు 2500 అడుగుల పొడుగు కల అడ్డకట్ట (టాంక్‌బండ్) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీనికి ఆ రోజులలోనే రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేశారు. ఇది పట్టణ ప్రజలకు మంచి నీరు అందివ్వడమే కాక ఇక్కడి వాతావరణాన్నే చల్లబరచింది. నేటి ప్రమాణాలతో పోల్చి చూస్తే దీనిని గొప్ప ఇంజనీరింగ్ ఘనకార్యంగానే భావించాలి. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీంసాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో నమోదు అయింది. కాని దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలుపర్చడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌షా వలి పేరుమీదగానే ప్రజలు దీనిని హుస్సేన్‌సాగర్ అని పిలిచేవారు.
భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్‌షా
హైదరాబాద్ నగర నిర్మాణం మహమ్మద్ కులీకుతుబ్ చేపట్టిన కార్యాలన్నిటిలోకి అత్యంత చిరస్మరణీయమైనది తన తండ్రి రూపొందించిన పథకం ప్రకారం మూసీకి దక్షిణదిశగా ఈ నగరాన్ని నిర్మించడం. దీనికాయన 1591లో పునాది వేశాడు. హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి దీనికి ముహుర్తం పెట్టించాడని ప్రతీతి. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగింది. దీనికి ఇరాన్‌లోని సుప్రసిద్ధ నగరమైన 'ఇస్ఫహాన్' రూపకల్పనననుసరించి 'అలీం' అనే వాస్తుశిల్పి రూపకల్పన చేశాడని చరిత్రకారుల అభిప్రాయం. అందువల్లనే ఈ నగర నిర్మాణంలో సముచిత పాత్ర వహించిన మహమ్మద్ కులీకుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ మొమిన్ ఈ నగరాన్ని 'నూతన ఇస్ఫహాన్'గావర్ణించాడు.
   

నిజాంల పాలన
ఆనాటి మొగల్ చక్రవర్తులు గోల్కొండ, బీజపూర్, తమిళనాడు, గుల్బర్గా, బీదర్, బీరార్ ప్రాంతాలను ఒక సుభాగా ఏకం చేసి దాని పరిపాలనకు ఒక సుభాదారుడిని నియమించేవారు. ఈ దక్కన్ సుభాదార్ ఔరంగాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాలను పరిపాలించేవాడు. 1713లో ఆనాటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్ మీర్ కమ్రుద్దీన్ చింక్ లిచ్‌ఖాన్ అనే సర్దార్‌ను దక్కన్ సుబేదారుగా నియమించారు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన స్థానంలో సయ్యద్ హుస్సేన్ ఆలీఖాన్‌ను ఆ పదవిలో నియమించారు. మీర్ కమ్రుద్దీన్ కేంద్రమంత్రులలో ఒకడిగా నియమితుడయ్యాడు. 1720లో సయ్యద్ సోదరుల తిరుగుబాటును అణచివేయడంలో ఆనాటి మొగల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (1719-1748)కు సాయపడి ఆయన నుంచి 'నిజాం-ఉల్-ముల్క్' అనే బిరుదు పొందారు.
   

కాని ఆయన దృష్టి దక్కన్‌పైనే ఉండేది. 1920లో దక్కన్ సుబేదార్‌గా నియమితుడయ్యాడు. కాని అప్పటికే ఆ పదవిలో ఉన్న ముబారిజోఖాన్ సుబేదారీ పదవిని వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో వీరిరువురి మధ్య 1724లో అక్టోబరు 11వ తేదీన షక్కర్‌గెడ్డ యుద్ధం జరిగింది. ఇందులో జయించిన నిజామ్ -ఉల్-ముల్క్ దక్కన్ సుబేదారుగా స్థిరపడ్డాడు. హైదరాబాద్ రాజ్యస్థాపన ఈ తేదీ నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. మహమ్మద్ ఆయనకు 'అసఫ్‌జా' అనే బిరుదు కూడా ఇచ్చాడు. నిజామ్-ఉల్-ముల్క్ వారసులు ఆ బిరుదునే తమ వంశ నామంగా ఉపయోగించారు. ఒకపక్క దక్కన్ సుబేదారుగా వ్యవహరిస్తూనే అసఫ్‌జా మొగల్ సామ్రాజ్య ప్రధాన మంత్రులలో ఒకడిగా కూడా వ్యవహరించేవాడు. 1739లో నాదిర్షా దండయాత్ర జరిగిన తర్వాత ఆయన ఢిల్లీని సందర్శించనేలేదు. ఢిల్లీ చక్రవర్తులు కూడా నామావశిష్టులైపోవడంతో నిజాం స్వతంత్రుడయ్యాడు. అలా దక్కన్ సుబేదారు ఆచరణలో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించింది.
చార్మినార్‌లోని 'చార్'ల అద్భుతం
నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు.
   



ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్ కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు.
హైదరాబాద్ పేరు వెనుక చరిత్ర
అఫ్ఘాన్ ప్రాంతం నుంచి వలస వచ్చి మొగలుల ద్వారా దక్కన్ ప్రాంతానికి రాజైన సుల్తాన్‌కులీ పరిపాలన సజావుగానే సాగినప్పటికీ ఆయన ఏడుగురు కొడుకుల మధ్య సయోధ్య లేని కారణంగా కుటుంబ కలహాలు తీవ్రస్థాయిలో ఉండేవి. రాజ్య కాంక్ష, కక్షలు తీవ్రరూపం దాల్చటంతో కులీ కుమారుడు ఇబ్రహీం పొరుగు రాజ్యమైన విజయనగరంలో దాదాపు ఏడు సంవత్సరాల పాటు తలదాచుకున్నాడు. ఈ సమయంలోనే అతను విజయనగర యువరాణిలలో ఒకరైన భాగీరథిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇబ్రహీం, భాగీరథి దంపతులకు పుట్టిన మహ్మద్ కులీ కుతుబ్‌షా కలల సాకారంగా రూపొందిందే హైదరాబాద్ నగరం. మహ్మద్ కులీ ప్రేమ చిహ్నంగా హైదరాబాద్ నగరాన్ని పేర్కొనవచ్చు. షాజహాన్ ప్రేమ తాజ్‌మహల్ రూపంలో ప్రపంచం అంతా పాకింది. కులీ తన భార్య భాగమతికి ఒక నగరాన్నే అంకితం ఇచ్చాడు. అయితే పేరు వివాదాస్పదం కావటం, దానిని మార్చటానికి కులీ అంగీకరించటంతో చరిత్రలో షాజహాన్ అంతటి గొప్ప ప్రేమికుడిగాప్రత్యేక ముద్ర సంపాదించుకోలేకపోయాడు. సంప్రదాయాలను ఎదిరించి కులీ భాగమతిని వివాహం చేసుకుని కోటకు తీసుకువచ్చాడు. భాగమతి ప్రతి కదలికా అప్పట్లో సంచలనం కలిగించేదట. స్వతహాగా మంచి కవి, కళాభిరుచి ఉన్న వ్యక్తి అయిన మహ్మద్ కులీ ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు కురిపించేవాడు. ఒక రోజు తాను కొత్తగా నిర్మిస్తున్న ప్రాంతానికి భాగమతిని తీసుకువెళ్లిన కులీ 'దీన్ని నీకు అంకితం ఇస్తున్నా' అని చెప్పాడట. నగర నిర్మాణం పూర్తయిన తర్వాత భాగమతి పేరు మీద నగరాన్ని భాగ్యనగరంగా పిలిచాడు మహ్మద్‌కులీ. అయితే ముస్లిం ప్రపంచానికి ప్రతినిధులుగా ఉండాల్సిన ప్రభువులు తమ రాజధానిని హిందూ ఛాయలు ఉన్న పేరుతో వ్యవహరించటం రాచకుటుంబంలో అనేక మందికి నచ్చలేదు. తరువాత భాగమతి తన మనుగడకే ప్రమాదం వచ్చే సూచనలు ఉండటంతో నిరాశకులోనైంది. పరిస్థితుల ప్రభావానికి తలవంచిన మహ్మద్‌కులీ మరో మార్గంలేక ప్రవక్త అల్లుడైన హైదర్అలీ పేరు మీద భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చటానికి అంగీకరించాడని చరిత్రకారుల నమ్మకం. అయితే కులీ మాత్రం హైదరాబాద్‌ని భాగ్యనగరంగానే వ్యవహరించేవాడని తెలుస్తోంది.




Followers