ఎవరీ బాహుబలి ? బాహుబలుడు రాజ్యం చేసింది తెలంగాణలోనే?...


జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్‌ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాత కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు
బాహుబలి పుట్టుక:
 విష్ణుపురాణం, జైన గ్రంథాలు, ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో 'బ్రాహ్మీ' లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మి లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు.ఒకరోజు రాజనర్తకి అయిన 'నీరాంజన' నిండుకొలువులో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణిస్తుంది. ఈ మృతితో 'జీవితం క్షణభంగురం' అని అర్థమైన ఋషభనాథుడు విరక్తుడవుతాడు. తన రాజ్యంలోని అయోధ్యకు భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి, పోదనపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి- తాను సర్వసంగపరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్లిపోతాడు. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే 'జినత్వం' పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధార ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

చక్రరత్న ఆయుధం

రిషభుడు లేదా రిషభదేవుడు అడవులకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు భరతుడు ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం బలమైన సైన్యాన్ని నిర్మించడంతో పాటు కొత్త కొత్త ఆయుధాలను తయారుచెయ్యడం ప్రారంభించాడు. అతడి సైన్యం 'చక్రరత్న' అనే ఆయుధాన్ని తయారు చేసింది. దీన్ని భరతుడే ప్రయోగిస్తాడు. ఇది గురితప్పదు. అప్పటి ప్రపంచంలో భరతుని చేతుల్లో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గరాలేవు. అందుకే అతడు పాలిస్తున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ లొంగిపోయాయి. చివరికి తన 98 మంది సోదరుల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు. తమ్ముళ్ళందరూ తమ రాజ్య భాగాలను అన్నగారికి అప్పగించి తమ తండ్రి ఉంటున్న అడవులకు వెళ్ళి ఆయన శిష్యులుగా మారారు. ఇలా మహా సామ్రాజ్యం స్థాపించడం వల్లనే ఈ భరతుని పేరుమీదుగా భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని జైనమతం ఆధారంగా చెపుతారు. శకుంతల,దుశ్యంతుల కుమారుడైన భరతుని పేరుమీదుగా ఈ పేరు రాలేదన్నది ఈ వాదనలోని ముఖ్యాంశం అయితే భరతుని జైత్ర యాత్రను అడ్డుకుంటూ ముందుకు వచ్చిన వీరుడు మాత్రం బాహుబలి

భరతుడు, బాహుబలి ల యుద్ధం


భరతుడు బాహుబలి ఇద్దరూ బలశాలురే, ఇద్దరి బలగాలూ బలమైనవే కాబట్టి ఈ యుద్ధంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేసారు. యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందు ఉంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి, సైన్యాలను యుద్ధంలో దించకుండా అన్నదమ్ములిద్దరే యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచినవారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన సారాంశం. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం, జలయుద్ధం, మల్ల యుద్ధం (ద్వంద్వ యుద్ధం) అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధం ప్రయోగించరాదనే షరతు విధించారు. ఆయుధాలు లేకుండా పోరాడి విజయం సాధించిన సమరం మానవచరిత్రలో ఇదే మొదటిది. అందుకే దీన్ని 'నిశస్త్రీకరణ' అన్నాడు. దీన్నే ఈరోజుల్లో మనం 'నిరాయుధీకరణ'గా అంటున్నాం.
ముందుగా దృష్టి యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధ నియమం ప్రకారం ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి. కళ్ళార్పకూడదు. ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క. బాహుబలి తన అన్న భరతుని కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధాగ్నుల్ని ఎలా విరజిమ్మడం... అనుకుంటూ ప్రసన్నవదనంతో అన్నగారి కళ్ళలోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితీ అలాగే ఉంది. తమ్ముడి ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అంతే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళుమూసి తెరిచేలోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెరపోయాడు. రెండవదైన జలయుద్ధం ప్రారంభమయింది. నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలిసిపోయాడు. ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలినే విజయం వరించింది.
రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ యుద్ధమూ ప్రారంభమయింది. ముందుగా భరతుడు బాహుబలునిపై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కిందపడిపోయాడు. తమ్ముడు కిందపడిపోవడంతో కంగారు పడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో తెప్పరిల్లి పైకి లేచాడు బాహుబలి. ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతుల్తో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందకు దించాడు. గట్టిగా గుద్దటానికి చెయ్యి పైకి లేపాడు. ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ హాహాకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణ భయంతో ఒణికిపోయాడు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడరాదనే నియమాన్ని పక్కనబెట్టి తన చక్రరత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచెయ్యలేదని జైన గ్రంథాలు చెబుతున్నాయి. నియమ విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడనే కోపంతో బాహుబలి అన్నను గుద్దటానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి. నేనేం చేస్తున్నాను. నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా తోబుట్టువును చంపబోతున్నాను...తుచ్ఛమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు. తండ్రిగారు, తమ్ముళ్ళ లాగే నేనూ సన్యాసం స్వీకరించి శాశ్వితానందాన్ని విశ్వప్రేమను పొందుతాను... ఇలా సాగింది బాహుబలి ఆలోచన. అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు, దుస్తులను తొలగించుకుని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. (జైన మతంలో దీక్ష తీసున్నవారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు). భరతుడు ఎంత వారిస్తున్నా వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.
తెలంగాణలో బాహుబలి

బాహుబలుడు రాజ్యం చేసింది  తెలంగాణలోనే. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న బోధన్‌ను పూర్వం పౌదన్యపురం అనీ, పోదన పురం అనీ పిలిచేవారు. ఇదే బాహుబలుని రాజధాని. ఈ విషయాన్ని చెప్పే కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. పోదనపురం గురించి మహాభారతంలో కూడా ఉంది. అక్కడ జైన, బౌద్ధ, వైదిక మతాలు సమానంగా విలసిల్లాయి. అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు, విష్ణుపురాణం చెబుతున్నాయి. బోధన్‌లో అనేక జైన విగ్రహాలు, ఆలయాలు కనిపించడంతో బాహుబలుని రాజధానిగా నిజంగానే ఈ పట్టణం విలసిల్లిందేమో అని కొందరు చరిత్రకారులు అంటున్నారు.


ఏకధాటిగా వీడియో గేమ్ ఆడిన వ్యక్తి మృతి


ekadhaatiga vidiyo gem aadina  vyakti


ఈ విషాద ఘటన తైవాన్‌లో చోటు చేసుకుంది వీడియో ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందడం ఇది రెండోసారి తైవాన్: మూడు రోజులపాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన తైవాన్‌లో చోటు చేసుకుంది. తైవాన్‌లోని తైపీకి చెందిన సెయ్(32) అనే వ్యక్తి స్థానిక ఇంటర్నెట్ కేఫ్‌లో మూడు రోజులపాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడుతూ మృతి చెందాడు.మొదట గమనించిన ఆ కేఫ్ సిబ్బంది అతడు నిద్రపోతున్నాడని భావించారు. కొంతసేపటి తర్వాత అనుమానం వచ్చి అతడ్ని పరికించి చూశారు. అతనికి శ్వాస ఆడకపోవడంతో వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.అతనికి అనారోగ్య లక్షణాలు ఏవీ లేవని.. అయితే నిరంతరాయంగా వీడియో గేమ్ ఆడటం వల్ల గుండె ఆగిపోయి ఉంటుందని చెప్పారు. కాగా, సెయ్ తరచూ తమ కేఫ్‌కి వస్తూ ఉంటాడని ఆ కేఫ్ యజమాని తెలిపారు. వచ్చిన ప్రతీసారీ ఇదే విధంగా ఎక్కువ గంటలు వీడియో గేమ్ ఆడుతూ ఉండేవాడని చెప్పారు. సెయ్ మృటి చెందిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు ఆ కేఫ్ సిబ్బంది చేరవేశారు. కాగా, తైవాన్‌లో వీడియో ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందడం ఇది రెండోసారి.






Followers